విషణ్ణ వదనంలో అద్వానీ
కుమార్తెతో కలసి వచ్చి అంతిమ నివాళి
న్యూఢిల్లీ,ఆగస్ట్17(జనం సాక్షి ): మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి చిరకాల మిత్రుడు అయిన బిజెపిఅగ్రనేత ఎల్కే అడ్వాణీ కన్నీటితో వీడ్కోలు పలికారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో… తన కుమార్తె ప్రతిభా అడ్వాణీతో కలిసి వాజ్పేయి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని కంటపడనీయకుండా ఆయన విషణ్ణ వదనంతో నివాళి అర్పించారు. వీరివెంట శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వాజ్పేయికి నివాళులు అర్పించిన అనంతరం అడ్వాణీ తీవ్ర విచారంతో వాజ్పేయ్ భౌతక కాయం వైపు తదేకంగా చూస్తూ కూర్చుండిపోయారు. వాజ్పేయి, అడ్వాణీ మధ్య 65 ఏళ్లపాటు సుదీర్ఘ కాలం పాటు స్నేహబంధం కొనసాగిన సంగతి తెలిసిందే. వాజ్పేయ్ మృతితో తనకు మాటలు రావడం లేదని అద్వానీ అన్నారు.