వీణ- వాణిలకు పరీక్షల తర్వాతే శస్త్రచికిత్స
– చిగురిస్తున్న ఆశలు
హైదరాబాద్,డిసెంబర్17(జనంసాక్షి): అవిభక్త కలవలు వీణా-వాణిలకు ఆపరేషన్ సాధ్యం అవుతుందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్ వైద్యులు ఈ విషయం ప్రకటించి వీరిని లండన్ తీసుకుని వస్తే ఆపరేషన్ చేస్తామని ప్రకటించారు. ఇందుకు అయ్యే ఖర్చును భరించడానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఈ దశలో ఎయిమ్స్ బృందం తమ నిర్ణయాన్ని వెల్లడించడం విశేషం. న్యూఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ కి చెందిన ముగ్గురు సభ్యుల న్యూరో వైద్యుల బృందం గురువారం హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి విచ్చేశారు. అవిభక్త కవలలైన వీణ-వాణిల శస్త్రచికిత్సకు సాధ్యాసాధ్యాలు, వైద్య పరీక్షలు తదితర వాటిపై ఈ బృందం పరిశీలన జరిపింది. వీణా-వాణిలకు శస్త్రచికిత్స సాధ్యం అవుతుందని తెలిపారు. త్వరలో వీరిని ఢిల్లీ ఎయిమ్స్కు తరలించనున్నట్లు సమాచారం. కాగా వీణా-వాణీలకు దాదాపు ఐదు విడతల్లో సర్జరీలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు 9 నుంచి 12 నెలల పాటు సమయం పట్టే అవకాశం ఉందని లండన్ వైద్యులు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. తాము ఇప్పటివరకు రెండుసార్లు అవిభక్త కవలలకు ఆపరేషన్లు చేశామని, వేరుపడ్డ ఆ నలుగురు కవలలు ఇప్పుడు క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. లండన్ వైద్యులను రప్పించి ఢిల్లీలోని ఎయిమ్స్లోనే శస్త్రచికిత్స చేయించాలని నిర్ణయించింది. దీంతో ఎయిమ్స్ వైద్యులతో ప్రభుత్వం సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో వీణా-వాణిలను వైద్యులు పరిశీలించారు. ఎయిమ్స్లో శస్త్రచికిత్స చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం లండన్ వైద్యులతోనూ ఆ బృందం సమాలోచనలు జరుపనుంది. దీంతో ఇప్పటికైనా వీరికి చెరవీడుతుందా అన్నది చూడాలి