వేదిక పైనుంచి జారిపడ్డ సీఎం

– తప్పిన ప్రమాదం
బోపాల్‌, జులై27(జ‌నంసాక్షి) :  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ మధ్యనే ఆయన చేపట్టిన ‘జన్‌ ఆశీర్వాద్‌ యాత్ర’ లో భాగంగా గురువారం సాయంత్రం ఛత్తర్‌ పూర్‌ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన సీఎం.. వేదిక దిగుతూ అదుపుతప్పి కిందపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది, సహచరులు ఆయన్ను పైకి లేపారు. ఈ ప్రమాదంలో సీఎంకు ఎటువంటి గాయాలు కాలేదు. ముఖ్యమంత్రి చౌహాన్‌ ‘జన్‌ ఆశీర్వాద్‌ యాత్ర’ లో భాగంగా గురువారం పన్నా నుంచి ఛత్తర్‌ పూర్‌ వరకు పలు ర్యాలీల్లో పాల్గొన్నారు. అనంతరం చండ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహరంగ సభలో ప్రసంగించిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పడం వల్లే వేదిక మెట్లపై నుంచి ముఖ్యమంత్రి కింద పడ్డారని, ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారని ఛత్తర్‌ పూర్‌ జిల్లా కలెక్టర్‌ రమేశ్‌ బండారి తెలిపారు.