వైకాపావి దిగజారుడు రాజకీయాలు

వారిని కాపీ కొట్టాల్సిన ఖర్మ టిడిపికి లేదు:

నెల్లూరు,జనవరి23(జ‌నంసాక్షి): కుంభకోణాల్లో ముని ప్రజల సొమ్ములను దోచుకున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలు పేరుతో ప్రజలను మబ్యపెట్టడం, అవి తాముకాపీకొట్టామనిచెప్పడం వింతగాక మరోటి కాదని ఎపి వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. నవరత్నాలను తాము కాపీ కొట్టామని ప్రచారం చేసుకోవడం వైకాపా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. టిడిపిని ఎవరైనా కాపీ కొట్టాల్సిందే తప్ప,టిడిపి ఎవరిని కాపీ కొట్టదన్నారు. అవినీతిపై పోరాడేందుకు ఎన్టీఆర్‌ టిడిపి స్థాపించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో తమ అనుభవమెంతో వైకాపా తెలుసుకుంటే మంచిదన్నారు. ఇంకా మాట్లాడుతూ జగన్‌ నేరాలను కాపీ కొట్టడం ఎవరితరమూ కాదన్నారు. కుంభకోణాలే వైకాపా అధ్యక్షుడు జగన్‌కు నవరత్నాలని మంత్రి మండిపడ్డారు. జగన్‌ నేరాలను కాపీకొట్టడం ఎవరి తరమూ కాదని ఆయన ఎద్దేవా చేశారు. పేదలకు పింఛన్ల పెంపు, కాపులకు 5శాతం రిజర్వేషన్లు, ఆటో డ్రైవర్లకు పన్ను తొలగించడం లాంటివి చేస్తే వైకాపా తమను నిందిస్తోందని మండిపడ్డారు. ట్రాక్టర్లపై పన్ను తొలగిస్తే విమర్శిస్తున్నారన్నారని దుయ్యబట్టారు. మంచి చేయడాన్ని వ్యతిరేకించే ఏకైక పార్టీ వైకాపా అని, సమాజానికి చెడు జరగాలని కోరే పార్టీ వైకాపా అన్నారు. పేదల సంక్షేమం పార్టీ తెలుగుదేశమని, ప్రజాధనం దోపిడి పార్టీ వైకాపా అన్నారు. చెప్పుకుంటూ పోతే జగన్‌ కుంభకోణాలకు అంతేలేదని మంత్రి పేర్కొన్నారు.రూ.లక్ష కోట్లు, 13 ఛార్జిషీట్లు, 16 నెలలు జైలు ఇవి తప్ప జగన్‌ సాధించిందేముందని ప్రశ్నించారు. సమాజానికి చెడు జరగాలని కోరే పార్టీ వైసీపీ అన్నారు. ఇలాంటి వారు ప్రజలకు సేవ చేస్తామని చెప్పడం మోసం చేయడం తప్ప మరోటి కాదన్నారు. జగన్‌ రాజకీయా జీవితం ప్రజలకు తెలియంది కాదన్నారు. వారిని కాపీ కొట్టాల్నిన ఖర్మ టిడిపికి పట్టలేదన్నారు. క్రిమినల్స్‌ రూపొందించే పథకాలను కాపీ కొడతారని అనుకోవడం బుద్దితక్కువన్నారు.