శబరిమలలో మరోమారు ఉద్రిక్తత

బిజెపి కార్యకర్తల అరెస్ట్‌కు నిరసన

తిరువనంతపురం,నవంబర్‌19(జ‌నంసాక్షి): శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఆంక్షలను వ్యతిరేకిస్తూ భక్తులు గత రాత్రి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. స్వాముల అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ కార్యకర్తలు సీఎం పినరయి విజయన్‌ నివాసం ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా కట్టుదిట్టమైన భద్రత మధ్య శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు ఈనెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం మరోసారి తెరుచుకున్న విషయం తెలిసిందే. శనివారం నుంచి రెండు నెలల పాటు మండల పూజలు సాగనున్నాయి. శబరిమలకు బయలుదేరిన మహిళలు, అయ్యప్ప భక్తుల నిరసనల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా భక్తులు రాకుండా అడ్డుకుంటున్న తరుణంలో పోలీసులు సుప్రీం ఆదేశాల మేరకు నడుచుకోబోతున్నారు.