శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్‌

తిరుమల,నవంబర్‌28(జనంసాక్షి): తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. గురువారం ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ-సి43 ఉపగ్రహం నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో శివన్‌ను సత్కరించారు.