షార్ట్ షర్క్యూట్తో అగ్నిప్రమాదం
– ఐదు పూరిళ్లు దగ్ధం
– తూర్పుగోదావరి జిల్లాలో ఘటన
కాకినాడ, జనవరి17(జనంసాక్షి) : తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రం కరపలోని కంచిరాజు నగర్ లో బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఐదు తాటాకిళ్ళు ఆగ్నికి ఆహుతయ్యాయి. కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కాలనీలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపుచేశారు. అప్పటికే ఐదిళ్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ ఇళ్లలో ఒక వ్యక్తి మాత్రమే ఉండగా, మిగతా వారు తాళాలువేసి ఊరికి వెళ్లారు. ఆ వ్యక్తిని స్థానికులు కాపాడారు. సమాచారం తెలిసిన వెంటనే మాజీ సర్పంచ్ పొలిశెట్టి తాతిలు, బ్రాహ్మణ కార్పొరేషన్ డిఎల్ఓడిహెచ్ వి.సాంబశివరావులు అక్కడకు చేరుకున్నారు. సమాచారాన్ని తహశీల్దార్ బూసి శ్రీదేవి ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీ సత్తిబాబుకు తెలియచేశారు. పాములు పట్టి జీవించే ముత్యాలు అనే వ్యక్తి ఇంట్లో రూ.5వేలు నగదుతోపాటు ఐదు పాములు మంటల్లో కాలి చనిపోయాయి. వారికి కొంత నగదుతో పాటు అల్పాహారాన్ని సాంబశివరావు అందజేశారు. ప్రమాదంతో ఐదు కుటుంబాలకు చెందిన 13మంది వీధిన పడ్డారు. దాదాపు ఐదు లక్షలు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.