సంసద్‌ సక్సెస్‌

జై తెలంగాణ నినాదాలతో మార్మోగిన జంతర్‌మంతర్‌
ఇదే ఆఖరి అవకాశం : కోదండరామ్‌
వంద రోజుల్లో తెలంగాణ ఇస్తాం : జవదేకర్‌
ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం : సురవరం
పలు జాతీయ పార్టీల మద్దతు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29 (జనంసాక్షి) :
టీ జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద తలపెట్టిన సంసద్‌యాత్ర తొలిరోజు సక్సెస్‌ అయింది. సోమవారం ప్రారంభించిన దీక్షలో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రజల డిమాండ్‌తో గొంతుకలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. సంసద్‌కు తరలివచ్చిన రెండు వేల మంది ప్రజలు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు హాజరయ్యారు. బీజేపీ, సీపీఐ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీల జాతీయ నాయకులు ప్రకాశ్‌ జవదేకర్‌, సురవరం సుధాకర్‌రెడ్డి, విశ్వాస్‌ తదితరులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకూ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత ప్రకటన వల్ల వెయ్యి మందికి పైగా యువకుల బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యమై పోరాడుతన్నప్పటికీ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వక పోవడం సరికాదన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని, ప్రత్యేక రాష్టాన్న్రి వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణపై తేల్చేయాలని డిమాండ్‌ చేశారు. బిల్లు పెట్టకుంటే ఊహించని రీతిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
జనసంద్రమైన జంతర్‌మంతర్‌
జంతర్‌మంతర్‌ జనసంద్రమైంది. టీ-జేఏసీ సత్యాగ్రహ దీక్షకు పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు హాజరయ్యారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం ఐఎల్‌ (న్యూ డెమోక్రసీ) పార్టీలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, న్యాయవాద జేఏసీ నాయకులు తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, యెండల లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, జూపల్లి కృష్ణారావు, నాగర్‌ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి, న్యూ డెమోక్రసీ నేతలు సూర్యం, గోవర్ధన్‌, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. తెలంగాణ వాదుల్లో రసమయి బాలకిషన్‌ నేతృత్వంలో కళాకారుల బృందం సాంస్కృతిక కార్యక్రమాలు హుషారెత్తించాయి. ఆటపాటలతో కళాకారులు ¬రెత్తించారు.
వంద రోజుల్లో తెలంగాణ
బీజేపీ అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జాతీయ నేత ప్రకాశ్‌ జగదేకర్‌ హామీ ఇచ్చారు. ఏడాదిలోపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించినా.. కాంగ్రెస్‌ వెనుకడుగు వేస్తోందని మండిపడ్డారు. జేఏసీ సత్యాగ్రహ దీక్షలో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణ ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆ తర్వాత వెనక్కు తగ్గిందని విమర్శించారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ మోసం చేసిందనన్నారు. తెలంగాణ విషయంలో అన్యాయాన్ని ఇక ప్రజలు సహించరని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ ఇచ్చే వరకూ ఈ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం 50 ఏళ్లుగా పోరాటం కొనసాగుతోందన్నారు. వెయ్యి మందికి పైగా బలిదానాలు చేశారని, ఇలాంటి త్యాగాలు గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించని కాంగ్రెస్‌ మోసం చేస్తోందన్నారు. న్యాయం చేయాల్సిన శ్రీకృష్ణ కమిటీ అన్యాయం చేసిందని ఉద్యమాన్ని ఎలా అణచివేయాలని రహస్య నివేదిక సమర్పించిందని ధ్వజమెత్తారు. డిసెంబర్‌ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, ఆ ప్రకటన ఎక్కడకు పోయిందని నిలదీశారు. తెలంగాణ డిమాండ్‌ న్యాయమైనదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని మొదటి ఎస్సార్సీయే గుర్తు చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌కు ఇదే చివరి అవకాశమని, ప్రస్తుత సమావేశాల్లో కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకపోతే ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని తాము కూడా కాంగ్రెస్‌ను కోరామని, బిల్లు పెడితే బేషరతుగా మద్దతిస్తామని చెప్పామన్నారు. రాష్టాన్న్రి విడగొడితే ఆంధ్ర, తెలంగాణలో ఇద్దరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులే ఉంటారని చెప్పామని, అయినా ఆ పార్టీ ముందుకు రాలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి లేదని, అందుకే బిల్లు తేవట్లేదన్నారు. టీ-కాంగ్రెస్‌ ఎంపీలు అక్కడ జై తెలంగాణ అంటున్నారు… ఇక్కడేమో నహి తెలంగాణ అంటున్నారని ధ్వజమెత్తారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా ఉద్యమంలోకి రావాలని కోరారు. వచ్చే ఏడాదిలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమని కాంగ్రెస్‌ ఇవ్వకున్నా తాము అధికారంలోకి రాగానే వంద రోజుల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాతో కలిసి రండి తెలంగాణ సాధించుకుందామని పిలుపునిచ్చారు.
ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం
తెలంగాణ సాధించే వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని, పోరాటం కొనసాగించాల్సిందేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సమస్య పెద్దదైనట్లు, ఇదేదో తీర్చలేని సమస్య అయినట్లు.. దీన్ని పదే పదే వాయిదా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. నిర్ణయం తీసుకోకుండా ఏదో ఒక సాకు చూపుతున్నారన్నారు. తెలంగాణ ఇస్తే మరిన్ని డిమాండ్లు వస్తాయని, అలా అవుతుందని, ఇలా అవుతుందని తప్పించుకొనేందుకు చూస్తున్నారని విమర్శించారు. మూడు రాష్టాల్రు ఏర్పాటు చేసినప్పుడు రానటువంటి సమస్యలు తెలంగాణ విషయంలో ఎందుకు వస్తాయని సురవరం ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేక లాబీయింగ్‌ ఒత్తిడి వల్లే కేంద్రం నిర్ణయంలో జాప్యం చేస్తోందని మండిపడ్డారు. అనేక రకాల ప్రత్యామ్నయాలతో గందరగోళం సృష్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇదే తుది హెచ్చరిక అని, తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమాన్ని విస్తృతం చేయాలని, ఐక్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధించే వరకూ పోరాటం కొనసాగించాలని, ఉద్యమానికి సీపీఐ వెన్నుదన్నుగా నిలుస్తుందని తెలిపారు.
బిల్లు పెడితే మద్దతిస్తాం: ఫార్వార్డ్‌ బ్లాక్‌
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చేయకుండా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. బిల్లు పెడితే తాము బేషరతుగా మద్దతిస్తామని హామీ ఇచ్చారు. 50 ఏళ్లుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల వెంట తామున్నామని, వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. దీక్షలో పాల్గొన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి మాట్లాడుతూ, దేశాన్ని 50 రాష్ట్రాలుగా కూడా విభజించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆ ప్రాంత ప్రజల జన్మహక్కని, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నోసార్లు వారిని సార్లు మోసం చేసిందని ఆరోపించారు.

తాజావార్తలు