సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
బర్మింగ్హామ్,ఆగస్ట్4(జనం సాక్షి): ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి సాధించిన సెంచరీపై ప్రశంసల వర్షం కురుస్తున్న వేళ కోహ్లీ అరుదైన మరో రికార్డును సొంత చేసుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును అతను కొల్లగొట్టేశాడు. ఈ శతకం ద్వారా విరాట్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. మాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. కోహ్లీ టెస్టు కెరీర్లో ఇది 22వ సెంచరీ. అయితే, సచిన్ తన కెరీర్లో 22 టెస్టు సెంచరీలకు 114 ఇన్నింగ్స్లు తీసుకోగా, కోహ్లీ మాత్రం 113 ఇన్నింగ్స్ ల్లలోనే ఈ మార్క్ను అందుకున్నాడు. దాంతో అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ప్రపంచ క్రికెటర్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. విరాట్ కంటే ముందు సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్ (58 ఇన్నింగ్స్), సునిల్ గవాస్కర్ (101 ఇన్నింగ్స్), స్టీవ్ స్మిత్ (108 ఇన్నింగ్స్) ఉన్నారు. అలాగే ఇంగ్లండ్ పై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన 13వ భారత క్రికెటర్ గా కోహ్లీ రికార్డుకెక్కాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అసాధారణ పోరాట పటిమతో చారిత్రక శతకం సాధించిన కోహ్లికి సోషల్ విూడియా వేదికగా అభిమానులు, మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సహచర ఆటగాళ్లు ఒక్కొక్కరూ ఇలా వచ్చి అలా వెనుదిరుగుతున్నా సమయంలో విరాట్ వీరవిహారం చేసి చిరస్మరణీయ బ్యాటింగ్తో టీమిండియాను ఆదుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత అరుదైన శతకాల్లో ఒకటిగా కోహ్లీ శతకం చిరకాలం గుర్తుండి పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
—-