సభలో ఏ చర్చలకైనా మేం సిద్ధమే

– విపక్షాలు లేవెత్తిన ప్రతీ సమస్యకు సమాధానం ఇస్తాం
– ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో విపక్షాలు లేవనెత్తిన ఎలాంటి సమస్యకైన సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని దేశ ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు పార్లమెంట్‌కు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విూడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపైనా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏ పార్టీ సభలో లేవనెత్తినా.. వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు చాలా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయని, అనుభవజ్ఞులైన సభ్యులు వాటిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని మేం కోరుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. బిల్లులపై చర్చలకు అన్ని పార్టీల సహకారం అవసరమని, సభా సమయాన్ని వృథా చేయవద్దని మోదీ చెప్పుకొచ్చారు. ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఆగస్టు 10 వరకు కొనసాగుతాయి.