సమాజం పట్ల మాకూ బాధ్యత ఉంది
సడక్బంద్ వాయిదా వేస్తున్నాం
పేలుళ్లు అమానవీయ చర్య : కోదండరామ్
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (జనంసాక్షి):
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ నెల 24న తలపెట్టిన ‘సడక్ బంద్’ వాయిదా పడింది. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నేపథ్యంలో సడక్ బంద్ వాయిదా వేయిస్తున్నట్లు తెలంగాణ పొలిటికల్ జేఏసీ ప్రకటించింది. బాధ్యతాయుత సంస్థగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పేలుళ్ల ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించింది. ఇంత మంది దుఃఖంలో ఉంటే సడక్బంద్ నిర్వహించడం సబబు కాదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో శుక్రవారం ఉదయం జేఏసీ అత్యవసరంగా సమావేశమైంది. ముష్కర మూకల రక్తపిపాసను తీవ్రంగా ఖండించింది. పేలుళ్లలో మృతి చెందిన వారికి
నివాళులర్పించింది. ఓ పక్క ఉగ్రవాదుల దాడితో రాష్ట్రం అల్లాడిపోతుంటే.. సడక్బంద్ నిర్వహించడం సరికాదని సమావేశం అభిప్రాయపడింది. అందుకే నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించింది. భేటీ ముగిసిన అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు. బాంబు పేలుళ్లు అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది అమానవీయ చర్య అని, పేలుళ్లను ఖండిస్తున్నామని తెలిపారు. ఇంత మంది దుఃఖంలో ఉంటే సడక్బంద్ నిర్వహించడం సరికాదని, అందుకే సడక్బంద్ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా ఉగ్రవాదులను నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఉద్యమాలను అణచడంపై ఉన్న ధ్యాస.. ఉగ్రవాదుల విషయంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. సడక్బంద్ను నిర్వీర్యం చేసేందుకు పెట్టిన దృష్టిలో ఉగ్రవాదులపై ఒక్క శాతం దృష్టి పెట్టినా ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదని విమర్శించారు. పేలుళ్లలో మృతి చెందిన, గాయపడిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలు కోలుకొనేలా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. జంట పేలుళ్లలో మృతులకు నివాళులర్పిస్తూ రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. జేఏసీ సమావేశం ముగిసిన అనంతరం దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల బాధితులను పరామర్శించేందుకు ఉస్మానియా, యశోదా, ఓమ్ని ఆస్పత్రులకు జేఏసీ నేతలు బయల్దేరి వెళ్లారు.