‘సమైక్య’ జేఏసీ కన్వీనర్‌ శైలజనాథ్‌ మనీ లాండ’రింగ్‌’

గుట్టువిప్పిన కోబ్రాపోస్ట్‌
స్టింగ్‌ ఆపరేషన్‌లో మంత్రి బాగోతం బట్టబయలు
మాట సాయం చేశా : శైలజానాథ్‌
హైదరాబాద్‌, మే 6 (జనంసాక్షి) :
సీమాంధ్ర పెత్తందారుల దోపిడీకి, ధనదాహానికి అంతేలేకుండా పోతుంది. తెలంగాణ ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన ఉద్యోగాలు, భూములు, వనరులు, నీళ్లు, నిధులను ఇష్టారాజ్యంగా దోచుకెళ్లి రాత్రికి రాత్రే కుభేరుల అవతారం ఎత్తిన మాయగాళ్లు జాతీయ సంపద అయిన బ్యాంకులకే కుచ్చుటోపీ పెట్టారు. ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌ ‘కోబ్రాపోస్ట్‌’ సోమవారం ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. సమైక్యాంధ్ర రాజకీయ జేఏసీ కన్వీనర్‌గా చెప్పుకునే మంత్రి సాకె శైలజానాథ్‌ ఇండియన్‌ బ్యాంకులో రూ.25 కోట్ల హవాలా ధనాన్ని డిపాజిట్‌గా పెట్టినట్లు కోబ్రాపోస్ట్‌ ఆధారాలతో సహా బయటపెట్టింది. రూ.25 కోట్ల బ్లాక్‌మనీ చెల్లింపునకు శైలజానాథ్‌ హామీ ఇచ్చిన పత్రాలను బయటపెట్టింది. ఆ డబ్బులు ఎలా సంపాదించినవో, ఎలా బ్యాంకులోకి చేరాయో అనే వివరాలేవి లేవు. తెలంగాణ వనరుల దోపిడీని యథేచ్ఛగా సాగిస్తున్న ముఠాలకు నాయకులుగా చెలామణీ అవుతున్న శైలజానాథ్‌లాంటి వాళ్లు హవాలా ద్వారా సమకూరిని సొమ్మును మూడో కంటికి తెలియకుండా బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేస్తున్నారు. తద్వారా బ్లాక్‌ మనీని చెలామణీలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శైలజానాథ్‌ మానీ లాండరింగ్‌ వ్యవహారం బట్టబయలైన ఆ భాగోతాన్ని సీమాంధ్ర మీడియా పట్టించుకోన్నట్లుగానే వ్యవహరించింది. తెలంగాణవాదానికి, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా నిత్యం విషం చిమ్మే సీమాంధ్ర పెత్తందారిశక్తుల చేతుల్లోని మీడియా దీనిపై చిన్నపాటి వార్తలు కూడా ప్రసారం చేయలేదు. సాయంత్రం వరకూ ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తడంతో శైలజానాథ్‌ను కాపాడుతున్నామనే అపప్రద నుంచి బయటపడేందుకు కొన్ని చానెళ్లు కోబ్రాపోస్ట్‌ కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు ప్రారంభించాయి. అదే తెలంగాణ నేతలెవరైనా అక్రమాలకు పాల్పడ్డట్టూ తేలితే పొద్దస్తమానం అవే వార్తలు ప్రసారం, ప్రచారం చేసే సీమాంధ్ర మీడియా తమ వారి వరకూ వచ్చే సరికి ఫక్తు ఆంధ్రోళ్ల ఫార్మూలానే పాటించింది. తెలుగు ప్రజల ఐక్యతారాగం సారంగా చెప్పుకునే సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక ఉన్న శక్తుల మతలబు కోబ్రాపోస్ట్‌ కథనంతో బట్టబయలైంది. వెలుగు చూసింది ఈ ఒక్కటే. ఇలాంటి చీకటి కోణలూ సమైక్యాంధ్ర ఉద్యమంలో వేళ్లూనుపోయాయి. తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను నిలువునా కొళ్లగొట్టి పునాదుల్లేకుండానే సమైక్యాంధ్ర పేరుతో మిథ్యా భవంతిని నిర్మించారు. తెలంగాణను అడ్డుకునేందుకు హవాలా రూపంలో పోగేసిన మొత్తాన్నంతా ఢిల్లీ పెద్దల వద్ద కుమ్మరించి అడ్డుకుంటున్నారు. సమైక్యాంధ్రకు, తెలుగువారంతా కలిసి ఉన్న ఐదున్నర దశాబ్దాల కాలానికి లంకెపెట్టి అంతా కలిసే ఉండాలని వితండవాదం చేసే వారి వెనుక చీకటికోణాలెన్నో. అమాయక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, ఈ ప్రాంత రాజకీయ నాయకులను తమ బానిసలుగా మార్చుకొని సీమాంధ్ర పెట్టుబడిదారి శక్తులు ఇంతకాలం సాగించిన దోపిడీ లెక్కలేనంత. కేవలం తమ అభిప్రాయాన్నే సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయంగా చెప్పి వారు ఇంతకాలం పబ్బం గడపాలని చూశారు. మొత్తానికి కోబ్రాపోస్ట్‌ కథనంతో సమైక్యాంధ్ర ముసుగులో సాగుతున్న తెరచాటు వ్యవహారాలు బయల్పడ్డాయని పలువురు తెలంగాణవాదులు పేర్కొంటున్నారు.

మాట సాయం చేశా : శైలజానాథ్‌

తాను మనీలాండరింగ్‌కు పాల్పడలేదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకె శైలజానాథ్‌ తెలిపారు. కోబ్రాపోస్ట్‌ కథనంతో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తగా వాటిపై ఆయన స్పందించారు. తిరుపతికి చెందిన డాక్టర్‌ హరిప్రసాద్‌ తనకు మంచి స్నేహితుడని, అతడికి కేవలం మాటసాయం మాత్రమే చేశానని చెప్పారు. తాను మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని తెలిపారు.

కోబ్రాపోస్ట్‌ కథనమిది…

రాష్టాన్రికి చెందిన ప్రైవేట్‌, ప్రభుత్వ బ్యాంకులతో పాటు మంత్రి శైలజానాథ్‌లు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నాయని కోబ్రా పోస్ట్‌ ఆపరేషన్‌-2లో పేర్కొంది. న్యూఢిల్లీ నుంచి విడుదలవుతున్న అంతర్జాతీయ మ్యాగజిన్‌ కోబ్రా పోస్ట్‌ రెడ్‌ స్పైడర్‌లో గత మార్చ్‌ నెలలో విడుదల చేసిన బులెటిన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో మనీ లాండరింగ్‌ అత్యంత ప్రమాదకరంగా జరుగుతోందని వివరించింది. తాజాగా విడుదల చేసిన వివరాల్లో రాష్టాన్రికి చెందిన ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులు కూడా ఇందుకు ఏమాత్రం దూరంగా ఉండడంలేదని పేర్కొంది. మంత్రి శైలజానాథ్‌ సుమారు 25 కోట్ల మనీ ల్యాండరింగ్‌కు గ్యారంటీ ఇచ్చాడని పేర్కొంది. ఇంకా విచారణ జరుగుతోందని చాలా మంది వ్యక్తులతోపాటు అధికార, ప్రైవేట్‌ సంస్థలు కూడా మనీల్యాండరింగ్‌కు పాల్పడుతూ నల్లదనాన్ని తెల్లదనంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. బడాబడా నేతలకు ఇందులో హస్తం ఉందంటోంది. కోట్లాది రూపాయల ట్యాక్స్‌ను ఎగ్గొట్టేందుకు భీమా సంస్థలు, బ్యాంకులు  వివిధ రూపాల్లో సహకరిస్తున్నాయని తద్వారా రాష్ట్ర, జాతీయ ఆదాయానికి గండి పడుతుందని పేర్కొంది. కోబ్రా పోస్ట్‌ విడుదల చేసిన జాబితాలో ప్రైవేట్‌ బ్యాంకులతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఉండడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఐసిఐసిఐ, యాక్సిస్‌, ధనలక్ష్మితో పాటు 23 బ్యాంకులు మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డాయని కోబ్రా పోస్ట్‌ పేర్కొంది.  ప్రబుత్వ రంగ బ్యాంకులైన ఎస్‌బిఐ, కెనరా, ఐఓబి, ఓబిసి, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పంజాబ్‌ నెషనల్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, దేనా బ్యాంకులు ఇందులో ఉన్నాయి. కెవైపి నిబంధనలను తుంగలో తొక్కారని పేర్కొంది. అలాగే ఎల్‌ఐసి, టాటా ఏఐజి భీమా సంస్థలు కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోలేదని వివరించింది. మంత్రి శైలజానాథ్‌ పేరు ఉటంకించడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం లేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిధుల అక్రమ ప్రవాహ నిరోధక చట్టం,  కెఎంఎల్‌ఏ, ఆదాయపు పన్ను చట్టం, బ్యాంకింగ్‌ చట్టాలను  సైతం తుంగలో తొక్కాయని కోబ్రా పోస్ట్‌ రెడ్‌స్పైడర్‌-2 ద్వారా పేర్కొంది.

తాజావార్తలు