సామిల్లు ఏర్పాటు ఫిర్యాదుపై గ్రామస్థుల నుండి వివరాల సేకరణ…

 

యస్ రాయవరం ఫిబ్రవరి 18(జనం సాక్షి ):మండలంలోని తిమ్మాపురం శివారు కోనవానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సామిల్లు పై గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు వివరాలు సేకరించారు. శుక్రవారం ఉదయం అటవీ శాఖ పాయకరావుపేట సెక్షన్ అధికారి వి. పైడిరాజు ఈ మేరకు సామిల్లు నిర్మాణప్రాంతంలో గ్రామస్థుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన సామిల్లు వల్లశబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు ఈ ప్రాంతంలో భూముల విలువ పడిపోతుందని గత నెలలో అటవీ డివిజన్ కార్యాలయంలో గ్రామస్థులు ఫిర్యాదు చేసారన్నారు. వారి ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో గ్రామస్థులను విచారించి వారి వాంగ్మూలంను తయారుచేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సి ఐ టియు సభ్యులు యమ్ సత్యన్నారాయణ, యమ్ రాజేష్ , గ్రామ పెద్దలు కోన అప్పలరాజు, గుర్రాచార్యులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు.