సాయిబాబా ఆలయంలో చోరీ

విచారణ చేపట్టిన ఎస్సై గణేష్, క్లూస్ టీం అధికారులు

జూలూరుపాడు, ఆగష్టు 8, జనంసాక్షి; మండల పరిధిలోని వెంగన్నపాలెం గ్రామం దత్తనగర్ లోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ పూజారి శ్రీరామచంద్రమూర్తి రోజువారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా సోమవారం తెల్లవారుజామున గుడి వద్దకు రావడంతో ప్రధాన ద్వార తెరిచి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లేసరికి గడియారం కనిపించకపోయేసరికి అనుమానం వచ్చి చూడగా గుడికి దక్షిణం వైపు ఉన్న ద్వారాన్ని పగలగొట్టి ఉండటానికి గమనించాడు. గుడిలో కానుకల హుండీలు పగల కొట్టి ఉన్నాయి. ఆలయానికి సంబంధించి సీసీ కెమెరాలు పనిచేయకుండా వైర్లు కత్తిరించి దొంగలు ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆలయ గౌరవాధ్యక్షులు యల్లంకి సత్యనారాయణ, పాలకవర్గ సభ్యుడు గుత్తా రమేష్ కూడా ఆలయం వద్దకు చేరుకుని పరిశీలించారు. స్థానిక ఎస్సై పోటు గణేష్, సిబ్బందితో పాటు కొత్తగూడెంకు చెందిన క్లూ‌స్ టీంకు చెందిన అధికారులు చోరీ సంఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.