సేవా కార్యక్రమాల్లో ముందున్న ఆర్యవైశ్య సంఘం: మంత్రి

ఏలూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): కొవ్వూరులోని ఆర్య వైశ్య సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కెఎస్‌.జవహర్‌ పేర్కొన్నారు. కొవ్వూరులోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి జవహర్‌కు పలువురు ఆర్య వైశ్య సంఘం నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ఆర్య వైశ్య సంఘం పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని అందరి అభిమానాన్ని పొందుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్య వైశ్యులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఈ ఘనత టిడిపి కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు జి. వీరభద్రస్వామి, అధ్యక్షులు ఎం.నారాయణ మూర్తి, ఎం.సత్యనారాయణ, పలువురు ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.