సోనియాగాంధీని కలిసిన కేంద్రమంత్రి
– లోక్సభ సమావేశాల గురించి చర్చ
న్యూఢిల్లీ, జూన్7(జనంసాక్షి) : మరికొద్ది రోజుల్లో లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమయ్యారు. శుక్రవారం ఉదయం సోనియా నివాసానికి వెళ్లిన జోషీ.. ఆమెతో 15 నిమిషాలు భేటీ అయ్యారు. లోక్సభ సమావేశాల గురించి చర్చించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, నరేంద్ర సింగ్ తోమర్ కూడా ఉన్నారు. సోనియాగాంధీతో పాటు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్, లోక్సభలో డీఎంకే పక్ష నేత టీఆర్ బాలులతో కూడా ప్రహ్లాద్ జోషీ సమావేశమయ్యారు. 17వ లోక్సభ తొలి సమావేశాలు జూన్ 17న ప్రారంభం కానున్నాయి. తొలి రెండు రోజుల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణస్వీకారం చేస్తారు. జూన్ 19న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 20న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. జులై 5న బ్జడెట్ను ప్రవేశపెట్టనున్నారు. జులై 26 వరకు సమావేశాలు సాగనున్నాయి. ఈ సమావేశాల్లో బ్జడెట్తో పాటు 10 ఆర్డినెన్స్లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.