స్టాలిన్‌కే డీఎంకే పగ్గాలు

– డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవ ఎన్నిక
– బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్‌
– 50ఏళ్ల తర్వాత అధ్యక్షుడి మార్పు
– సంబరాల్లో డీఎంకే నేతలు, కార్యకర్తలు
– కోశాధికారిగా దురైమురుగన్‌ ఎన్నిక
చెన్నై, ఆగస్టు28(జ‌నం సాక్షి) : డీఎంకే(ద్రవిడ మున్నేత్ర కజగం) పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి కుమారుడు ఎం.కె.స్టాలిన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్‌ ప్రకటించారు. పార్టీ కోశాధికారిగా దురైమురుగన్‌ ఎన్నికయ్యారు. స్టాలిన్‌ ఎన్నికతో డీఎంకే శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. పార్టీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి నినాదాలు చేస్తున్నారు. డీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడుగా కొనసాగుతున్న కరుణానిధి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి డీఎంకే అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు స్టాలిన్‌ అధ్యక్షుడిగా ఉంటారని అందరూ భావిస్తున్న సమయంలో కరుణానిధి మరో కుమారుడు, డీఎంకే బహిష్కృత నేత అళగిరి పేరు తెరపైకి వచ్చింది. దీంతో తనను డీఎంకేలోకి మళ్లీ చేర్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని  హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీలోకి తనను చేర్చుకోకుంటే సెప్టెంబర్‌ 5న చెన్నైలో తలపెట్టిన ర్యాలీలో తన సత్తా ఏంటో చూపిస్తానని అళగిరి అన్నారు. కరుణానిధికి నివాళులర్పించేందుకు నిర్వహిస్తోన్న ఈ ర్యాలీకి పార్టీ కార్యకర్తలు తన నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు. కరుణానిధి మరణం తర్వాత పార్టీని కాపాడటానికే తాను ఇవన్ని చేస్తున్నానని విలేకరులతో  అళగిరి చెప్పడంతో పార్టీ శ్రేణుల్లో కొంత అమయోమయానికి గురి చేసింది. కాగా మంగళవారం జరిగిన  సమావేశంలో స్టాలిన్‌ ఏకగ్రీవ ఎన్నిక కావటంతో డీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.
సమర్థవంతమైన నేతగా గుర్తింపు..
కరుణానిధికి స్టాలిన్‌ మూడో కుమారుడు. 1953 మార్చి 1న మద్రాసులో జన్మించారు. ఈయన పుట్టిన నాలుగు రోజుల తర్వాతే రష్యా అధ్యక్షుడు స్టాలిన్‌ మరణించారు. వామపక్ష భావాలపై ఉన్న మమకారంతో కరుణానిధి తన తనయుడికి స్టాలిన్‌ అని పేరు పెట్టారు. స్టాలిన్‌ చిన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. 14ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1967 ఎన్నికల్లో తండ్రి తరఫున ప్రచారం చేశారు. 1973లో డీఎంకే జనరల్‌ కమిటీకి స్టాలిన్‌ ఎన్నికయ్యారు. 1977లో ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన తొలిసారి 1989లో అసెంబ్లీ సీటు గెలిచారు. మళ్లీ రెండేళ్లకు జరిగిన పోల్స్‌లో ఓడిపోయారు. కానీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన మళ్లీ ఓటమి ఎదుర్కోలేదు. 1996లో స్టాలిన్‌ చెన్నై మేయర్‌గా చేశారు. అప్పుడు ఆయన సత్తా ఏంటో చాటారు. పరిపాలనను ఆధునీకరించేందుకు ఆయన ఎన్నో చర్యలు చేపట్టారు. స్టాలిన్‌పై తిరుగుబాటు చేస్తున్న సోదరుడు అలిగిరికి ఇప్పుడు పార్టీలో ఎటువంటి ¬దాను ఇస్తారన్న అంశం కూడా చర్చకు వస్తున్నది. గడిచిన 50 ఏళ్లుగా డీఎంకే పగ్గాలు కరుణ చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో వస్తున్న స్టాలిన్‌ ఆ పార్టీని మరింత బలోపేతం చేస్తారని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలే స్టాలిన్‌ సత్తాకు గీటురాయి కానున్నాయి.
వ్యూహాత్మకంగా పావులు కదిపిన స్టాలిన్‌..
యాభై ఏళ్లపాటు డీఎంకే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన కరుణానిధి కన్నుమూసిన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో స్టాలిన్‌ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న ఆయన కరుణానిధి అనారోగ్యంతో ఇంటికే పరిమితమైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో అన్ని పనులు చూసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పార్టీలో బలమైన నేతగా, తండ్రి రాజకీయ వారసుడిగా శ్రేణులకు గట్టి నమ్మకాన్ని కల్పించారు. పార్టీలోని సీనియర్‌ నేతల నుంచి కుటుంబంలోని ఎక్కువ మంది సభ్యుల వరకు మద్దతును కూడా ఆయన కూడగట్టారు. అయితే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన స్టాలిన్‌ అన్న అళగిరి మాత్రం కాస్త కలకలం రేపారు. తన తండ్రి మద్దతుదారులు తనవైపే ఉన్నారని, అవసరమైనప్పుడు సత్తా చాటుతానన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పినట్లుగానే వచ్చే నెల 5న చెన్నైలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. అవసరమైతే సొంత పార్టీ పెట్టడమా? భాజపా, రజనీకాంత్‌ పార్టీతో కలిసి నడవడమా? అనేది కూడా ఆయన ర్యాలీ తర్వాత వెల్లడించే అవకాశం ఉంది. అళగిరి ఎంత హెచ్చరికలు చేసినప్పటికీ స్టాలిన్‌లో మాత్రం ఏమాత్రం ఆందోళన కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పార్టీ పగ్గాలు చేపట్టిన మూడో వ్యక్తి..
అన్నాదురై, కరుణానిధి తర్వాత డీఎంకే పగ్గాలు చేపట్టిన మూడో వ్యక్తిగా స్టాలిన్‌ నిలిచారు. 1944లో పెరియార్‌ ఈ. వి రామస్వామి ద్రవిడార్‌ కజగం పార్టీని స్థాపించారు. ఇదే పార్టీలో సీఎన్‌ అన్నాదురై కూడా ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత పెరియార్‌, ఆయన అనుచరులకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో 1949లో అన్నాదురై పార్టీ నుంచి విడిపోయి ద్రవిడ మున్నేట్ర కజగం అనే పేరుతో సొంతంగా పార్టీ ప్రారంభించారు. 1969లో అన్నాదురై మరణించారు. దీంతో మళ్లీ పార్టీ వారసుడిపై విబేధాలు తలెత్తాయి. సీనియర్‌ నేతలైన కరుణానిధి, వీఆర్‌ నెదున్‌చెజియాన్‌ మధ్య పోటీ నెలకొనగా.. కరుణానిధివైపే పార్టీ నేతలు మొగ్గుచూపారు. దీంతో కరుణానిధి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఐదు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా కరుణానిధి అధ్యక్ష బాధ్యతలు కొనసాగించారు. తాజాగా కరుణ మరణంతో స్టాలిన్‌ పార్టీ పగ్గాలు చేపట్టారు.