స్వచ్ఛభారత్‌ అంటే పరిశుభ్రమైన భారత్‌ మాత్రమే కాదు

5

– చెత్త, మలినం మనసులోంచి తీసేయండి!

– అసహనంపై మరోమారు  గళం విప్పిన రాష్ట్రపతి

అహ్మదాబాద్‌,డిసెంబర్‌1(జనంసాక్షి):

భారత్‌లో అసహనంపై లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరోసారి దేశంలో అసహనంపై మాట్లాడారు. భారత్‌ అహింస అనే సూత్రం ఆధారంగా ఏర్పడిందని, ఎంతో వైవిధ్యంతో కూడిన దేశం మనదని గుర్తుచేశారు. భారత్‌లో వైవిధ్యాన్ని అందరూ అర్థంచేసుకోవాలని ప్రణబ్‌ గతంలోనే సూచించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సబర్మతీ ఆశ్రమంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రణబ్‌ మాట్లాడుతూ ప్రజల్లో అసహనం గురించి వ్యాఖ్యానించారు. దేశంలో నిజమైన చెత్త రోడ్లపై లేదని.. ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. సమాజాన్ని విభజించే భావజాలాన్ని మన మనసుల్లోంచి తీసివేయడానికి ఇష్టపడకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. భారత్‌ సంఘటిత దేశంగా ఉండాలని గాంధీ కలలు కన్నారని చెప్పారు. ఇక్కడ అన్నిరకాల ప్రజలు సమానమని, అందరూ సమానంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలని, ఆనందంగా ఉండాలని అన్నారు. మనుషులపై ఒకరికొకరికి నమ్మకం ఉండాలన్నారు. గాంధీ ఉద్దేశంలో స్వచ్ఛభారత్‌ అంటే కేవలం పరిశుభ్రమైన భారత్‌ మాత్రమే కాదని.. స్వచ్ఛమైన మనసు, వాతావరణం అని రాష్ట్రపతి ప్రణబ్‌ అన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ అర్థంచేసుకుని ముందుకు సాగాలన్నారు. మన మనసులను మలినం చేసుకుని మాట్లాడడం తగదన్నారు. విశాల హృదయంతో ముందుకు సాగుదామని అన్నారు.