స్వచ్ఛ విజయవాడ కోసం కృషి

విజయవాడ,జనవరి17(జ‌నంసాక్షి): రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో స్వచ్ఛభారత్‌ కింద స్వచ్ఛతకు పెద్దపీట వేయాల్సి ఉందని మేయర్‌ కోనేరు శ్రీధర్‌ చెప్పారు. స్వచ్ఛతవైపు ప్రజలను ఆకర్షించేలా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రచార కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. కోనేరుహంపికి స్వచ్ఛవిజయవాడ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన తరవాత ప్రజల్లో కొంత మార్పు వచ్చిందని తెలిపారు. ప్రజలు కూడా ఇందులో స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్యర్యంలో ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌తోపాటు, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలను చురకుగా కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం నగరంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను స్వచ్ఛత యాప్‌ ద్వారా అధికారుల దృష్టికి తెచ్చి వేగంగా పరిష్కరించుకునే అవకాశం ఉన్నందున ప్రజలు ఆ వైపు ముందుకు సాగాలని కోరారు. స్వచ్ఛసర్వేక్షణ్‌ కింద సాగే సర్వేలో ప్రజలు భాగస్వాములై నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు.