హార్దిక్‌ పటేల్‌కు రెండేళ్లు జైలుశిక్ష

– గుజరాత్‌ కోర్టు సంచలన తీర్పు
మహెసాణా, జులై125(జ‌నంసాక్షి) : పటీదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌కు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీంతో పాటు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 2015లో పటిదార్‌ ఆందోళన సందర్భంగా విస్‌నగర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే రుషికేశ్‌ పటేల్‌ కార్యాలయంలో విధ్వంసం చోటుచేసుకుంది. ఈ కేసులో పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పీఏఏఎస్‌) కన్వీనర్‌ హార్దిక్‌ పటేల్‌ను విస్‌నగర్‌ న్యాయస్థానం దోషిగా నిర్దారించింది. కాగా హార్దిక పటేల్‌తో పాటు సర్దార్‌ పటేల్‌ గ్రూప్‌ కన్వీనర్‌ లాల్‌జీ పటేల్‌, మరో పటీదార్‌ నేత అంబాలాల్‌ పటేల్‌ కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. వీరికి కూడా రూ.50 వేల జరిమానాతో పాటు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా కోర్టు తీర్పు వెలువడగానే హార్దిక్‌ పటేల్‌ తరపు న్యాయవాది బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసినట్టు సమాచారం. గుజరాత్‌ విద్యా, ఉద్యోగాల్లో తమకు ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్‌ కల్పించాలంటూ పటేల్‌ వర్గీయులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. 2015 జూలైలో హార్దిక్‌ పటేల్‌ నేతృత్వంలో జరిగిన పటీదార్‌ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.