హావిూల అమలు చేయకుండా మోసం

వరంగల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకో ప్రకటనతో ప్రజలను మభ్యపెడుతున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. బంగారు తెలంగాణ పేరుతో ఇంకెంతకాలం మోసం చేస్తారని అన్నారు. అనేక మందికి జీతాలు రావడం లేదనీ, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు మంజూరు కావడం లేదనీ, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో బంగారు పంటలు పండే భూములు బంజర్లుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్‌ తదితర ప్రాంతాల్లో బలవంతపు భూసేకరణతో రైతులను ముంచుతున్నారని అన్నారు.  బంగారు తెలంగాణ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పండుగల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని అన్నారు. రైతుల బతుకులు ఛిద్రం అవుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రిజర్వేషన్ల పేరిట ముస్లింలను, ఎస్టీలను మోసగిస్తున్నారని ఆరోపించారు.