హిమాచల్‌ సీఎంగా వీరభద్రసింగ్‌ ప్రమాణం

సిమ్లా, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ొమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. 78 ఏళ్ల వీరభద్రసింగ్‌.. ఈ దఫా సీఎంగా పదవీ కాలం పూర్తి చేసుకుంటే.. దాదాపు 16 ఏళ్లకు పైగా హిల్‌ స్టేట్‌ను పాలించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించనున్నారు. మంగళవారం సిమ్లాలోని రాజభవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ ఉర్మిళాసింగ్‌.. ఉదయం 10.30 గంటలకు వీరభద్రసింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరభద్రసింగ్‌తో పాటు తొమ్మిది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విద్యా స్టోక్స్‌తో పాటు కౌల్‌సింగ్‌, జీఎస్‌ బాలి, సుజన్‌సింగ్‌ పఠానియా, ఠాకూర్‌ సింగ్‌ భార్మౌరి, ముకేశ్‌ అగ్ని¬త్రి, సుధీర్‌ శర్మ, ప్రకాశ్‌ చౌదరి, ధనిరం సంధిల్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్‌ ధుమాల్‌, ఆయన సహచర మంత్రులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అలాగే, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులెవరూ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడం గమనార్హం. వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో వీరభద్రసింగ్‌.. సరిగ్గా ఉదయం 10.40 గంటలకు రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 28 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది ఆరోసారి. 1983 ఏప్రిల్‌ 8న ఠాకూర్‌ రామ్‌లాల్‌ స్థానంలో ఆయన తొలిసారి సీఎంగా ప్రమాణం చేశారు.