హైదరాబాద్లో ఎల్ఈడీ లైట్ల తయారీ
– సిస్కా, ఏవోడీ ప్రతినిధులు సీఎం కేసీఆర్తో భేటీ
హైదరాబాద్ నవంబర్ 30 (జనంసాక్షి):ఏవోడీ కంపెనీతోపాటు రూ.5 వందల కోట్ల పెట్టుబడితో 50 ఎకరాల్లో ఎల్ఈడీ లైట్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు భారత్కు చెందిన సేల్స్ కంపెనీ సిస్కా , హైదరాబాద్లో ఎల్ఈడీ లైట్ల తయారీ యూనిట్ల స్థాపనకు అమెరికాకు చెందిన అడ్వాన్స్ ఆస్ట్రానిక్ డివైసెస్ (ఏవోడీ) ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది.
క్యాంప్ కార్యాలయంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావును సిస్కా, ఏవోడీ కంపెనీ ప్రతినిధులు కలిశారు.రాష్ట్రంలో దాదాపు రెండువేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్దంగా ఉన్నామని సిస్కా ప్రతినిధులు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్తోపాటు అనుబంధ పరిశ్రమలు కూడా స్థాపిస్తామని ఏవోడీ, సిస్కా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. మార్చి నుంచే ఉత్పత్తులు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నామని పేర్కొన్నారు.ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. యూనిట్ స్థాపనకు అవసరమయ్యే భూమి, ఒతర మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా, తక్కువ సమయంలో సమకూరుస్తామని హావిూ ఇచ్చారు. కంపెనీల స్థాపనకు అన్ని విధాల సహకరిస్తామన్నారు. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎక్కువ వెలుతురునిచ్చే ఎల్ఈడీ లైట్ల వినియోగం పెరగాల్సి ఉందన్నారు. ఎల్ఈడీ లైట్ల వినియోగం పెరిగే కొద్ది డిమాండ్ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపన కోసం చేసిన టీ ఎస్ ఐపాస్ చట్టం మంచి ఫలితాలను ఇస్తోందని వివరించారు.
ఇప్పటికే 69 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా బిజినెస్ ఎట్ ఈజ్ అనే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో త్వరలో ఫార్మా, సినిమా సిటీలు రాబోతున్నాయని వివరించారు. ఐటీ కంపెనీలు కూడా తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడే పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు.