హైదరాబాద్లో జంట బాంబుపేలుళ్లు
22 మంది మృతి..70 మందికి పైగా గాయాలు
సైకిల్, టిఫిన్ బాక్స్ బాంబులతో పేల్చిన ముష్కరులు
రక్తసిక్తమైన దిల్సుఖ్నగర్
ఛిద్రమైన శరీరాలు, రోదనలతో మిన్నంటిని ఘటన స్థలం
ఉస్మానియా, గాంధీ, యశోద ఆస్పత్రుల్లో క్షతగాత్రులు
రెండు రోజుల క్రితమే హెచ్చరించాం : షిండే
ఎంతటి వారైనా వదిలిపెట్టం : సీఎం
హైదరాబాద్, ఫిబ్రవరి 21 (జనంసాక్షి) :
బాంబు పేలుళ్లతో హైదరాబాద్ నగరం దద్దరిల్లింది. నల్లటి తారురోడ్డు ఎర్రటి నెత్తురుతో తడిసి ముద్దయింది. ఛిన్నాబిన్నంగా పడి ఉన్న శవాలు, రక్తమోడుతున్న దేహాలతో ఆపన్నహస్తం కోసం ఆరాటపడే క్షతగాత్రులు, చుట్టూ మంటలు, దట్టమైన పొగతో దిల్షుక్నగర్ బస్టాండ్ ప్రాంతం శ్మశానాన్ని తలపించింది. అమాయకులే లక్ష్యంగా ఉగ్రవాదులు సైకిల్, టిఫిన్ బాక్సుల్లో పెట్టిన బాంబులు పేల్చడంతో 22 మంది దుర్మరణం చెందారు. 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
గురువారం సాయంత్రం 7.00 గంటలు. దిల్షుక్నగర్లోని వెంకటాద్రి, కోణార్క్ థియేటర్ ప్రాంతాలు రద్దీగా ఉన్నాయి. అప్పుడే ఆఫీసు పని ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన వారు. పొద్దంతా శ్రమించి ఇళ్లకు బయలు దేరిన కార్మికులు, స్నేహితులతో కలిసి సినిమాకు బయలు దేరినవారు, కప్పు ఛాయ్ లాగిద్దాం రా గురూ అంటూ అటుగా వెళ్లిన మిత్రులు, కాస్త రిలీఫ్ కోసం రోడ్డుపైకి వచ్చిన కుర్రకారు.. సీనియర్ సిటిజన్లతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా ఉంది. పల్లెటూరి భాషలో చెప్పాలంటే అది జనజాత్ర. సరిగ్గా అదే సమయంలో వెంకటాద్రి థియేటర్ వద్ద మొదటి బాంబు పేలింది. అప్పటి వరకు వాహనాల రణగొన ధ్వనులతో సందడిగా ఉన్న ప్రాంతంలో ఏదో తెలియని అలజడి. పేలుళ్ల దాటి దూరంగా ఎగిరిపడిన దేహాలు. ఏదో జరిగింది ఇంకా ఇక్కడే ఉంటే ఏం జరుగుతుందో అనే భయంతో ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగందుకున్న సామాన్యులు అంతటా ఉద్వేగం.. సరిగా మూడు నిమిషాల తర్వాత వెంకటాద్రి థియేటర్ 150 మీటర్ల దూరంలోని దిల్షుక్నగర్ బస్టాండ్ వద్ద మరో పేలుడు. అంతే అప్పటి వరకు కాస్త నిబ్బరంగా ఉన్న గుండెల్లో కూడా ఆందోళన మొదలైంది. గోకుల్ఛాట్, లుంబినీపార్క్ పేలుళ్లు అందరి కళ్ల ముందు కదలాడాయి. వారి లక్ష్యం ఒక్కటే తమ ప్రాణాలు రక్షించుకోవడం. ఆ క్రమంలో కొందరు కిందపడి తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలయ్యారు. సరిగ్గా పది నిమిషాల్లో దావానలంలా ఈ వార్త గుప్పుమంది. పోలీసులు అప్రమత్తమై వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన మరో బాంబును గుర్తించి నిర్వీర్యం చేశారు. దిల్షుక్నగర్ అంబులెన్స్లు, పోలీసు వాహనాలతో కిక్కిరిసిపోయింది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న ప్రజలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద స్పందించాయి. ఘటనకు బాధ్యులను వెంటనే పట్టుకొని శిక్షిస్తామంటూ ఓ అపహాస్యపు ప్రకటన జారీ చేశాయి. ఆ తర్వాతే క్షతగాత్రుల గురించి మాట్లాడాయి. గాయపడ్డ వారిని ఉస్మానియా, గాంధీ, యశోద, టీకేఆర్, ఒమ్ని, కమలా తదితర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
మృతుల వివరాలు
ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం నల్లూరుకు చెందిన ముత్యాల రాజేశ్వర్, వడ్డే విజయ్కుమార్ ఉద్యోగ ప్రయత్నాల్లో భగంగా నగరంలోని ముసారాంబాగ్లో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వారిద్దరు అదే సమయంలో అటుగా వెళ్లి మృత్యువాత పడ్డారు. ఎంబీఏ విద్యార్థిని స్వప్నారెడ్డి (బండ్లగూడ), వెంకటేశ్వర్రావు (మలక్పేట), ఆనంద్కుమార్ (అనంతపురం), గుంట తిరుపతి (గోదావరిఖని), ఇజాజ్ అహ్మద్ (అబ్దుల్లాపూర్), విజయ్కుమార్ (సెలక్టెడ్ ఎస్సై, ఆదిలాబాద్), రాములు (జీహెచ్ఎంసీ ఉద్యోగి), రఫీ (బాబానగర్), మహ్మద్ అలీ (పటన్చెరు), పద్మాకర్(చైతన్యపురి), హరీశ్ (దిల్షుక్నగర్) తదితరులున్నారు.
ఒకే కుటుంబంలో ఆరుగురు క్షతగాత్రలు
హైదరాబాద్లో పనిచేస్తున్న తమ కుమారుడ్ని చూడటానికి నల్గొండ జిల్లా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. గంగారామ్ హైదరాబాద్లోని ఓ దుకాణంలో పనిచేస్తున్నాడు. అతడి తల్లి గంగులు (50), అన్న రవీందర్, వదిన లక్ష్మి, వారి పిల్లలు అర్చన, అనిల్కుమార్ నగరానికి వచ్చాడు. అంతా కలిసి ఆనందంగా షాపింగ్ చేశారు. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బస్టాండ్ చేరుకున్నారు. అదే సమయంలో బాంబు పేలింది. అనిల్కుమార్, అర్చనకు స్వల్పగాయాలు కాగా మిగతా నలుగురు తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండు రోజుల క్రితమే హెచ్చరించాం : షిండే
హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించే అవకాశముందని రెండు రోజుల ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే అన్నారు. హైదరాబాద్ బాంబు పేలుళ్ల అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులను ఆదుకుంటామని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఎంతటివారైనా వదిలిపెట్టం : సీఎం
బాంబు పేలుళ్లకు పాల్పడి అమాయకుల ప్రాణాలు బలిగొన్న వారు ఎంతటివారైనా వదిలిపెట్టమని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించి వెళ్లిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దోషులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు పరిహారం చెల్లిస్తామన్నారు. వారికి పూర్తిగా వైద్యం అందిస్తామని తెలిపారు.