హైదరాబాద్‌ ముంపు ప్రాంతాల్లో నేడు కేంద్రబృందం పర్యటన

వరద నష్టంపై అంచనా

హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): హైదరాబాద్‌తో పాటు తెలంగానలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం గురువారం సాయంత్రం నగరానికి రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం తీవ్రతను అంచనా వేయనున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో రూ.వేల కోట్ల మేర నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లను విడుదల చేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం హైదరాబాద్‌కు రానుంది. ఇప్పటికే నగర ప్రజలకు తక్షణ సాయం కింద ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ. 550 కోట్ల సాయం ప్రకటించారు. వరద ప్రభావితమైన కుటంబాలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇక ఢిల్లీ ప్రభుత్వం రూ. 15 కోట్లు, తమిళనాడు ప్రభుత్వం రూ. 10 కోట్లు, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూ. 2 కోట్లు, మై ¬ం సంస్థ రూ. 5 కోట్లు, చిరంజీవి, మహేశ్‌ బాబు, పవన్‌ కల్యాణ్‌ రూ. కోటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి విరాళం అందించారు. హైదరాబాద్‌ ప్రజలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మహా నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతోంది. డీఆర్‌ఎఫ్‌ బృందాలు వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్‌ ప్రముఖులు సైతం తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు అందించారు.