21న జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ !

రాజమండ్రి, జనవరి18(జ‌నంసాక్షి) : ఈనెల 21న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరుతున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. రాజకీయ వ్యవస్థను పవన్‌ ప్రక్షాళన చేస్తారన్న నమ్మకంతో జనసేనలో చేరుతున్నానని, పవన్‌ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ తరపున రాజమండ్రి అర్బన్‌ స్థానం నుంచి ఆకుల పోటీ చేశారు. ఎమ్మెల్యే బీజేపీలో ఉన్న సమయంలో కూడా ఆయన భార్య పవన్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్యే కూడా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. చివరికి ఈ ప్రచారమే నిజమైంది.