23నుంచి మోదీ విదేశీ పర్యటన

న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : ప్రధాని నరేంద్ర మోదీ జులై 23 నుంచి 27 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రువాండ, ఉగాండ, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. 23, 24 తేదీల్లో రువాండలో మోదీ పర్యటించనున్నారు. భారత ప్రధానమంత్రులు ఎవరూ కూడా ఇప్పటి వరకు రువాండలో పర్యటించలేదు. తొలిసారిగా ప్రధాని మోదీ.. రువాండ వెళ్తున్నారు. రక్షణ శాఖకు సంబంధించిన అంశాలపై రువాండతో మోదీ ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. 24, 25 తేదీల్లో ఉగాండలో పర్యటించనున్న మోదీ.. ఉగాండ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. 25 నుంచి 27 తేదీల్లో దక్షిణాఫ్రికాలో మోదీ పర్యటించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి మోదీ హాజరు కానున్నారు.