23న సూర్యలంకలో పౌర్ణమి ఉత్సవం
గుంటూరు,నవంబర్21(జనంసాక్షి): సూర్యలంకలో ఈ నెల 23న నిర్వహిస్తున్న కార్తీక పౌర్ణమి, రత్న గర్భ సాగర హారతి ఉత్సవం నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. సూర్యలంక బీచ్ను ఆయన సందర్శించి భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. భక్తులకు తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. మహిళలు దుస్తులు మార్చుకోవటానికి ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు కావూరి శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి చెన్నుపాటి కిశోర్, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు పాల్గొన్నారు.