28, 29 తేదీలలో తెలంగాణలో మాయావతి ఎన్నికల ర్యాలీ

అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఈ నెల 28, 29 తేదీలలో తెలంగాణలో బిఎస్‌పి జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారని ర్యాలీని జయప్రదం చేయాలని బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. హిందూపురం పట్టణం అబాద్‌ పేట బిఎస్పి కార్యాలయంలో శనివారం బిఎస్పి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి నాజీమ్‌ భాష అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ.. పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను పార్టీలోకి ఆహ్వానించి బహుజనులకు

రాజ్యాధికారం బిఎస్పి ద్వారానే సాధ్యం చేయగలమన్నారు. మహనీయులు మహాత్మ జ్యోతిబాపూలే, ఛత్రపతి సాహు మహారాజ్‌, బాబా సాహెబ్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, మాన్యవర్‌ కాన్షీరాం ల సిద్ధాంతాలను, ఆశయాలను, బహు జనులకు తెలియజేయవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందన్నారు. రాజ్యాధికారం లేనిదే ఏ సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఈ నెల 28, 29 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో బిఎస్‌పి జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో బిఎస్‌పి అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించడానికి మాయావతి ప్రసంగించనున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బరాయప్ప, దాసరి ఈశ్వరయ్య , ఎంఎల్‌ నారాయణ, డీ.తిమ్మయ్య, క్రిష్టప్ప, నరసింహ మూర్తి, ఫక్రుద్దీన్‌, రామప్ప, నరసింహులు, రహంతుల్లా, యేసయ్య, ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.