50ఏళ్ల తర్వాత లభ్యమైన.. 

సైనికుడి మృతదేహం
– మంచుకొండలపై చెత్తను శుభ్రం చేస్తుండగా బయటపడ్డ మృతదేహం
సిమ్లా, జులై21(జ‌నం సాక్షి) : విమాన ప్రమాదంలో చనిపోయిన ఓ సైనికుడి మృతదేహం దాదాపు 50 ఏళ్ల తర్వాత లభ్యమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచుకొండలపై ఉన్న చెత్తను పర్వతారోహకులు శుభ్రం చేస్తుండగా ఈ మృతదేహం బయట పడింది. ఇండియన్‌ మౌంటెయినింగ్‌ ఫౌండేషన్‌ ఈ క్లీన్లీనెస్‌ డ్రైవ్‌ను చేపట్టింది. ధాకా గ్లేసియర్‌ బేస్‌ క్యాంప్‌ వద్ద పర్వతారోహకులు శుభ్రం చేస్తుండగా తొలుత విమాన శకలాన్ని గుర్తించారు. కొద్ది దూరంలోనే సైనికుడి మృతదేహం లభ్యమైంది. తొలుత మాకు విమాన శకలాలు దొరికాయి. తర్వాత మా బృంద సభ్యులు శకలాలు దొరికిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే మృతదేహాన్ని గుర్తించారు. వాటిని ఫొటో తీసి ఆర్మీ హై అల్టిట్యూట్‌ వెల్ఫేర్‌ స్కూల్‌కు పంపించాం. 1968లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి మృతదేహంగా గుర్తించారని క్లీన్‌ డ్రైవ్‌ టీమ్‌ లీడర్‌ రాజీవ్‌ రావత్‌ తెలిపారు. 1968, ఫిబ్రవరి 7వ తేదీన చండీగఢ్‌ నుంచి 98 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో లేహ్‌ బయలు దేరిన విమానం రోహ్‌తంగ్‌ సవిూపంలో కూలిపోయింది. దాదాపు 35ఏళ్ల
తర్వాత 2003లో ఈ విమాన శకలాన్ని ధాకా గ్లేసియర్‌ వద్ద గుర్తించారు. ఆ తర్వాత 2003 నుంచి 2017 వరకు గాలింపు చర్యలు చేపట్టగా ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా పలువురి మృతదేహాలు ఆ మంచులోనే ఎక్కడో కూరుకుపోయి ఉంటాయని వాటి కోసం గాలింపు చర్యలు చేపడతామని అధికారులు అప్పట్లో తెలిపారు.
————————————–