లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి : వరుసగా ఏడు రోజులు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. కీలక వడ్డీరేట్లు పెంపుపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్న తరుణంలో బ్యాంకింగ్ సెక్టార్లో ద్రవ్య లభ్యతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించడంతో మార్కెట్లు లాభాల బాట పట్టాయి. దీంతోపాటు అమెరికా ఫెడరల్ బ్యాంకు ఉద్దీపనలు కొనసాగించనుందన్న వార్తలు మార్కెట్ లాభాలకు వూతం ఇచ్చాయి. 205 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 20,399 వద్ద ముగిసింది. టాటా మోటార్స్ ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ, టాటా స్టీల్ తదితర షేర్లు లాభాల బాటలో పయనించాయి. మరోపక్క జాతీయ స్టాక్ ఎక్సైంజ్ నిఫ్టీ కూడా 66 పాయింట్లు లాభపడి 6,056 వద్ద ముగిసింది.