చంద్రబాబు వైఖరి బాధాకరం : టీ ఎంపీలు

నూఢిల్లీ: తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని టీ కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. అన్ని పార్టీలు అంగీకరించాకే తెలంగాణపై కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలు పార్టీ నుంచి బయటకు రావాలని హితవు పలికారు. తెలంగాణ కావాలంటే తెలంగాణ టీడీపీ నేతలు పార్టీలో కొనసాగవద్దని, టీడీపీలో ఉంటే రాజకీయ సమాధి కట్టుకున్నట్లేనన్నారు. చంద్రబాబు కల్లు తాగిన కోతిలా వ్యవహరిస్తూ చిందులేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజలది న్యాయమైన, ధర్మమైన కోరిక కాబట్టే విజయం దిశగా వెళుతున్నామని పేర్కొన్నారు. ఇంకా తెలంగాణ ప్రజల్ని పరిపాలించాలనుకునే కుట్ర ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కిరణ్‌, బాబు, జగన్‌ ముగ్గురూ తెలంగాణ వ్యతిరేకులేనని ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగ బద్దంగానే ముందుకెళ్తోందని భరోసా వ్యక్తం చేశారు.