జాతీయ రహదారిపై అత్యవసరంగా దిగిన విమానం

భోపాల్‌ : భోపాల్‌ పట్టణానికి 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న బేటూల్‌-నాగ్‌పూర్‌ జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు విమానం అత్యవసరంగా దిగింది. పైలట్‌ సురక్షితంగా ఉన్నాడు. నాలుగు సీట్ల సామర్థ్యం ఉన్న ఈ సెస్నా విమానం శ్యామ్‌ వర్మ అనే ప్రవాస భారతీయుడిదిగా గుర్తించారు. ఉదయం 9.30 గంటలకు రహదారిపై విమానం దిగడంతో వాహనాల రాకపోకలకు అర్ధగంట పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానం వెళ్తున్న దిశలో తేడా రావడంతో అప్రమత్తమై అత్యవసరంగా కిందికి దించేసినట్లు పైలట్‌ తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ ను క్రమబద్దీకరించారు.