రేపు విజయ్‌ దివస్‌ను ఘనంగా నిర్వహించాలి

 

 

 

 

 

డిసెంబర్ 07(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్‌ 9వ తేదీని (విజయ్‌ దివస్‌) ఘనంగా నిర్వహించుకోవాలని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు పార్టీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం విజయ్‌ దివస్‌ సంబురాలను అంబరాన్నంటేలా జరపాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజే డిసెంబర్‌ 9 అని గుర్తుచేశారు. నవంబర్‌ 29న దీక్షా దివస్‌ను విజయవంతం చేసినట్టే, కేసీఆర్‌ 11 రోజుల దీక్ష ఫలించిన డిసెంబర్‌ 9వ తేదీని విజయం సాధించిన రోజుగా విజయ్‌ దివస్‌ పేరుతో పండుగలా జరుపుకోవాలని సూచించారు.

డిసెంబర్‌ 9నే 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్షకు కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఒక రూపం వచ్చిందని తెలిపారు. అంతటి ఘనమైన చారిత్రక ఘట్టాన్ని మరోసారి స్మరించుకుంటూ, ఆనాడు కేసీఆర్‌ తెలంగాణ కోసం చేసిన త్యాగాన్ని గుర్తుచేస్తూ, ప్రత్యేక రాష్ట్ర ప్రకటన సిద్ధించిన రోజును పండుగలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరూ బిజీగా ఉన్నందున, గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లోనే కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టంచేశారు. మంగళవారం చేపట్టాల్సిన విజయ్‌ దివస్‌ కార్యక్రమాలపై కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్‌ నిమ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం

బీఆర్‌ఎస్‌ అధినేత, ఉద్యమ సారధి కేసీఆర్‌ దీక్ష ఫలవంతమైన నిమ్స్‌ దవాఖాన, గాంధీ దవాఖానలో మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలు ఉంటాయని, నగర నాయకత్వం ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కేటీఆర్‌ సూచించారు. రెండు రోజులు సమయం ఉన్నందున జిల్లా అధ్యక్షులు చొరవ తీసుకొని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యేలా సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

విజయ్‌ దివస్‌ కార్యక్రమాల వివరాలు

  • నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకం చేయాలి.
  • డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలి.
  • ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలి.
  • పార్టీ కార్యాలయాల వద్ద లేదా ప్రధా న కూడళ్లలో విజయానికి సూచికగా పింక్‌ బెలూన్లను ఎగురవేయాలి.
  • కార్యక్రమం అనంతరం మీడియాకు బ్రీఫింగ్‌ ఇవ్వాలి.
  • కేసీఆర్‌దీక్ష, తెలంగాణ పోరాటం, విద్యార్థుల త్యాగాలను ప్రజలకు, భవిష్యత్తు తరాలకు గుర్తుచేయాలి.