ఆ సమాచారం అంతా వాళ్లిద్దరి వద్దే: కమిషన్ ఎదుట ఈటల రాజేందర్

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను శుక్రవారం కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ విచారించింది. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వద్దే ఉండేదని, ఆర్థిక శాఖకు ఇందులో పెద్దగా పాత్ర లేదని స్పష్టం చేశారు.”కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్ర ఏమీ లేదు” అని ఈటల రాజేందర్ తేల్చిచెప్పారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, దానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఛైర్మన్‌గా వ్యవహరించారని గుర్తుచేశారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారని, అయితే ఆనకట్టల నిర్మాణం అనేది పూర్తిగా సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని, దానిపై రాజకీయ నాయకులకు అవగాహన ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రాజెక్టు వ్యయం గురించి ప్రస్తావిస్తూ, “మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.63 వేల కోట్లతో ప్రతిపాదన చేశారు. తర్వాత అనేక కారణాలతో ప్రాజెక్టు వ్యయం రూ.82 వేల కోట్లకు పెరిగింది” అని ఈటల వివరించారు. కమిషన్ తనను ఆర్థికపరమైన అంశాలపై ప్రశ్నలు అడిగిందని, కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలపై ఆర్థిక శాఖ ప్రమేయం ఉందా అని ప్రశ్నించిందని తెలిపారు. దీనికి ఆర్థిక శాఖకు ఏమాత్రం సంబంధం లేదని, ఇది పూర్తిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన విషయమని తాను కమిషన్‌కు స్పష్టం చేసినట్లు చెప్పారు.”నా కణతపై తుపాకీ పెట్టినా సరే.. నిజమే మాట్లాడతా. తప్పుఒప్పులు ఎవరివో తెలంగాణ ప్రజలు తేలుస్తారు” అని ఈటల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై అన్ని రిపోర్టులు బయటపెట్టాలని, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవద్దని హితవు పలికారు. ప్రాజెక్టు నష్టాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. “ఈ ప్రాజెక్టు తన మానస పుత్రిక అని కేసీఆర్ వందల సార్లు చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా నైతిక విలువలు పాటించా” అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

తాజావార్తలు