బండ్లకు బుజ్జగింపు.. గద్వాల ఎమ్మెల్యే ఇంటికి మంత్రి జూపల్లి

కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధికార పార్టీ ఆపసోపాలు పడుతున్నది. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలోపడ్డారు. పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్‌ మున్షీ, ప్రభుత్వ సలహాదారు నరేందర్‌ రెడ్డితో కలిసి మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఆయన తిరిగి భారాసలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లినట్లు తెలుస్తున్నది.అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణమోహన్‌రెడ్డి గద్వాల నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం అయన ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో అసెంబ్లీలో భేటీఅయ్యారు. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని బండ్ల చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లారు.