భగ్గుమన్న పెద్దధన్వాడ
` ఇథనాల్ ఫ్యాక్టరీ పనులపై పెల్లుబికిన ప్రజాగ్రహం
` సుమారు 2వేల మంది తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత
` మహిళలపై ఫ్యాక్టరీ ప్రైవేటు సైన్యం దాడితో అదుపుతప్పిన పరిస్థితి
` ఓ కంటైనర్, కారు, హిటాచీ వాహనం, గుడిసెలకు నిప్పు
` ముప్పై మందికిపైగా అరెస్ట్.. పోలీస్ స్టేషన్లో నిర్బంధం
` గ్రామాల నుంచి ప్రజలు తరలిరాకుండా ఉదయం నుంచే అడ్డుకున్న పోలీసులు
` అరెస్ట్ చేసినవారిని విడుదల చేయకపోతే పోలీస్స్టేషన్లను ముట్టడిస్తామని గ్రామస్తుల హెచ్చరిక
రాజోలి, జూన్ 04 (జనంసాక్షి):
పెద్దధన్వాడలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఇచ్చిన మాటకు కట్టుబడలేదని నిలదీసేందుకు వస్తున్న ప్రజలపై ఫ్యాక్టరీ ప్రైవేటు సైన్యం దాడి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఓ మహిళ తలకు తీవ్రంగా గాయం కావడంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆయా గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణ స్థలంలో పెద్దఎత్తున మోహరించారు. అక్కడ ఏర్పాటు చేసిన కంటైనర్కు నిప్పుపెట్టారు. హిటాచీ, కారును ధ్వంసం చేశారు. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేసినా అప్పటికే దాదాపు రెండువేల మంది చేరుకోవడంతో ఫ్యాక్టరీ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ప్రజాప్రతినిధులు, పోలీసులు, అధికారులు హామీలిచ్చి మాట తప్పారని భగ్గుమన్నారు. అయితే బుధవారం ఉదయం నుంచే పలు గ్రామాల్లో మోహరించిన పోలీసులు పరిశ్రమ నిర్మాణ స్థలానికి రాకుండా అడ్డుకున్నారు. కొందరు గ్రామ నాయకులను నిర్బంధించారు.
జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మొదట్నుంచి ఆందోళనలు కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రిలే దీక్షలు కూడా చేపట్టగా.. కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ అధికారుల హామీతో దీక్షలను విరమించారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో పెద్దధన్వాడలో కంటైనర్, కొన్ని యంత్రాలతో పాటు ప్రైవేటు సైన్యాన్ని యాజమాన్యం మోహరించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అదేరోజు ఆందోళనకు దిగారు. మరుసటి రోజు బుధవారం ఉదయాన్నే పెద్దధన్వాడ, మాన్దొడ్డి, చిన్న తాండ్రపాటు, నసనూరుతో పాటు పలు గ్రామాలకు చెందిన మహిళలు, రైతులు పెద్దఎత్తున ఫ్యాక్టరీ పనుల వద్దకు బయల్దేరారు. ఉదయం నుంచే పోలీసులు, అధికారులు పదుల సంఖ్యల్లో మోహరించినప్పటికీ గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. పురుగుల మందు డబ్బాలతో నిరసనలు చేపడుతున్న గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని, ఈ అంశంపై ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులను నిరసనకారులు ఎదురించడం.. ఇథనాల్ ఫ్యాక్టరీనా.. మేమా? ఏదో ఒకటే ఉండాలన్నట్లుగా భీష్మించడంతో వారికి సర్థిచెప్పలేక పోలీసులు వారిని చదరగొట్టే ప్రయత్నం చేశారు.
ప్రజలపై ప్రైవేటుసైన్యం దాడితో…
ఎలాగైనా ఫ్యాక్టరీ నిర్మించాలని యత్నిస్తున్న యాజమాన్యం ఒకరోజు ముందే ప్రైవేటు సైన్యాన్ని తీసుకొచ్చింది. కొందరు మహిళలు, మరికొందరు యువకులను అక్కడ మోహరించింది. దీంతో పరిశ్రమను వ్యతిరేకిస్తున్న ప్రజలు బుధవారం నిరసన చేపట్టేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇథనాల్ కంపెనీ రౌడీ షీటర్లు కర్రలతో కొట్టడంతో మరియమ్మ అనే మహిళ గాయపడిరది. ఆమెను అయిజ హాస్పిటల్కు తరలించగా తలకు 6 కుట్లు వేసి చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం గద్వాలకు తీసుకెళ్లారు. కంపెనీ వద్దు అని శాంతియుత నిరసన తెలపడానికి వెళ్లిన మహిళలపై, రైతులపై కంపెనీ రౌడీలు దాడి చేయడంతోనే పరిస్థితి అదుపుతప్పింది. ప్రైవేటు రౌడీల దాడితో ఆగ్రహానికి గురై కంపెనీకి చెందిన కార్లు, టెంట్లు, సామాగ్రికి నిప్పు పెట్టారు. టిప్పర్లు, జేసీబీలను అడ్డుకుని అద్దాలను ధ్వంసం చేశారు. కంపెనీలో పని చేయడానికి వచ్చిన ప్రైవేట్ కూలీలను దాడి చేసి తరిమికొట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. ఘటనా స్థలంలో పోలీసులను భారీగా మోహరించి నిరసనలకు దిగిన రైతులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగతనంగా కంటైనర్లు, టిప్పర్లు, జేసీబీలను తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. చివరకు పోలీసు అధికారులు సముదాయించడంతో గ్రామస్తులు శాంతించారు.
గ్రామస్తులపై కేసులు, అరెస్టులు..
ఇథనాల్ కంపెనీ రద్దు కోసం పోరాటం చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్కి తరలించారని చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ గ్రామస్తులు తెలిపారు. కొంకల నర్సింహులుతో పాటు పలువురిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. మానపాడు, రాజోలి పోలీస్ స్టేషన్లలో వారిని నిర్బంధించినట్టు చెప్పారు. ఈ విషయమై రాజోలి ఎస్ఐ వివరణ కోరగా మాకేం తెలీదని చెప్పడం గమనార్హం. అయితే అరెస్ట్ చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే నేడు పెద్దఎత్తున పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని పలు గ్రామస్తులు హెచ్చరించారు. నేడు పోలీస్ స్టేషన్ల ఎదుట నిరసనలకు కూడా దిగుతామని చెప్పారు.