లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బుదేరా పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి
సంగారెడ్డి జూన్ 16(జనంసాక్షి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామపంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. గత 20 సంవత్సరాలుగా మునిపల్లి మండలంలో పంచాయతీ కార్యదర్శి గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా వివిధ పనుల నిమిత్తం చాలామంది దగ్గర లంచం తీసుకున్నట్టు చెబుతున్నారు. సోమవారం మునిపల్లి మండలంలోని బుదేరాలో రూ. 3వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. పంచాయతీ కార్యాలయం రికార్డులు చూపించాలని ఏసీబీ అధికారులు అడుగగా పంచాయతీ కార్యదర్శి ఇవ్వకపోవడంతో మునిపల్లి ఎంపీడీవో కార్యాలయానికి తీసుకెళ్లినట్టు తెలిసింది. పంచాయతీ కార్యదర్శి నివాసం కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ లో కూడా తనిఖీలు నిర్వహిస్తామని ఏసీబీ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.