పురుషోత్తం రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్‌ నివాళి

హైదరాబాద్‌ : వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందగా.. ఈరోజు సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంగా మహాప్రస్థానానికి వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి.. పురుషోత్తం పార్థీవ దేహానికి నివాళులర్పించి, మంత్రి ఉత్తమ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పురుషోత్తం రెడ్డి మృతిపట్ల బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా, తలసాని కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.