రాబోయే 48 గంట‌ల్లో తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

గ‌త నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ధ్య‌, వాయవ్య బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం కార‌ణంగా రాబోయే 48 గంట‌ల్లో రాజ‌ధాని హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది.హైద‌రాబాద్, రంగారెడ్డి, మేడ్చ‌ల్ – మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెద‌క్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ‌ల్, నిజామాబాద్, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్‌క‌ర్నూల్, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో రాబోయే 48 గంట‌ల్లో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని, గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవ‌కాశం ఉంద‌న్నారు. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. నిన్న అత్య‌ధికంగా జ‌న‌గామ జిల్లాలోని దేవ‌రుప్పులలో 11.5 సెం.మీ. వ‌ర్షపాతం న‌మోదైంది.హైద‌రాబాద్ న‌గ‌రంలో నిన్న వాన దంచికొట్టిన విష‌యం తెలిసిందే. సరూర్‌న‌గ‌ర్, రాక్ టౌన్ కాల‌నీ, నాగోల్‌లో అత్య‌ధికంగా 86 మి.మీ., బండ్ల‌గూడ‌లో 75.5 మి.మీ., హ‌బ్సిగూడ‌లో 70.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. రామాంత‌పూర్‌లో 51 మి.మీ., హ‌య‌త్‌న‌గ‌ర్‌లో 50.55 మి.మీ., ఉస్మానియా యూనివ‌ర్సిటీలో 42.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు.