డ్రగ్స్‌ రహిత సమాజం కోసం పాటుపడుదాం

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే చిరంజీవి సహా పలువురు స్టార్‌ నటులు భాగస్వామ్యం అయిన విషయం తెలిసిందే. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపారు. డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని పిలుపునిచ్చారు.‘మన దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో, లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది. రండి.. నాతో చేతులు కలపండి. డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంతో భాగస్వాములు అవ్వండి. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్‌ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా.. వెంటనే యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరోకు సమాచారం ఇవ్వండి’ అని ఎన్టీఆర్‌ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత తెలంగాణకై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌ కు సహకరిస్తూ తనవంతు బాధ్యతగా ఎన్టీఆర్‌ ఈ వీడియోను విడుదల చేశారు.