భారత ఆర్మీ నూతన అధిపతిగా ఉపేంద్ర ద్వివేదీ

న్యూఢిల్లీ: తదుపరి ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే నుంచి ఈ నెల 30న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని రక్షణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ద్వివేది వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా వ్యవహరిస్తున్నారు.జనరల్‌ పాండే మే 31నే పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్రం ఆయన పదవీకాలాన్ని నెలపాటు పొడిగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆర్మీ చీఫ్‌ పదవీ కాలం పొడిగించడం అత్యంత అరుదు. మరోవైపు, రేవాలోని సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి అయిన ద్వివేది.. 1984లో 18 జమ్ము అండ్‌ కశ్మీర్‌ రైఫిల్స్‌లో చేరారు. 39 ఏండ్ల మిలిటరీ కెరీర్‌లో ఆయన నార్తర్న్‌, వెస్టర్న్‌ థియేటర్స్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు.