సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ స‌ర్కార్

 సింగ‌రేణి కార్మికుల క‌ష్టాన్ని రేవంత్ స‌ర్కార్ బొగ్గుపాలు చేసింద‌ని బీఆర్ఎస్ పార్టీ ధ్వ‌జ‌మెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నమ్మించి నట్టేట ముంచిందని మండిప‌డింది. సింగరేణి లాభాలను భారీ మొత్తంలో (33%) కార్మికులకు పంచుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్.. ఈ సంవత్సరం లాభాలు పెరిగినప్పటికీ కార్మికులకు మాత్రం అందించింది కొంతే. గత 15 ఏళ్లలో ఈసారే అత్యంత తక్కువ మొత్తంలో (కేవలం 16.9%) లాభాలు కార్మికులకు అందాయని బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.సింగరేణి కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాపై కార్మిక వర్గాల్లో తీవ్ర‌ నిరసన వ్యక్తమవుతున్నది. కార్మికులకు ఈ సారి ప్రకటించిన వాటా బూటకమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. రికార్డు బొగ్గు ఉత్పత్తి సాధించడంతో రూ.4,071 కోట్ల నికర లాభాలు వచ్చినట్టు యాజమాన్యం పేర్కొన్నది. ఇందులో నుంచి సింగరేణి భవిష్యత్తు ప్రణాళిక కోసం 2,289 కోట్లను పక్కన బెట్టినట్టు సెలవిచ్చిందని, మిగతా రూ.2,412 కోట్ల లాభాల నుంచే కార్మికులకు 33 శాతం కింద రూ.796 కోట్లను బోనస్‌గా అందజేస్తామని ప్రకటించడంతో కార్మిక వర్గాల్లో నిరసన వ్యక్తమవుతున్నది.సంస్థ యాజమాన్యం పక్కన పెట్టిన 2,289 కోట్లకు 33 శాతం వాటాలు ఎగ్గొడుతున్నదని నేతలు ఆరోపిస్తున్నారు. గత పదేండ్లలో నికర లాభాల్లో కార్మికుల బోనస్‌ను పరిశీలిస్తే ఈసారే అతి తక్కువ బోనస్‌ వచ్చిందని వారు తేల్చి చెప్తున్నారు. 2022-23లో 32 శాతం బోనస్‌ అంటే రూ.2,222 కోట్లకు రూ.711 కోట్లను సంస్థ ఉద్యోగులకు బోనస్‌గా అందజేసింది. ఇప్పుడు 50 శాతం లాభాలను పక్కనబెట్టి, మిగతా 50 శాతానికే బోనస్‌ను ప్రకటించింది. దీంతో కార్మికులకు తీవ్రంగా నష్టం జరిగింది.