సీనియ‌ర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు

అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై సాక్షి టీవీకి చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు ఈరోజు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.కొన్ని రోజుల క్రితం సాక్షి ఛానల్‌లో ప్రసారమైన ఒక చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణం రాజు అమరావతిని ఉద్దేశించి, “అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, అమరావతి రాజధాని ప్రాంత మహిళలు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో జర్నలిస్టులు కృష్ణం రాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కంభంపాటి శిరీష కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ తర్వాత గుంటూరు లేదా మంగళగిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.ఇదే కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో జర్నలిస్ట్ కృష్ణం రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడలోని ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో, ఆయన హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, విజయవాడ మరియు తుళ్లూరు నుంచి ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. సోమవారం సాయంత్రంలోగా కృష్ణం రాజును కూడా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజావార్తలు