అప్పు తీర్చని తండ్రి
ఆగష్టు 16(జనం సాక్షి) ఓ వడ్డీ వ్యాపారి దారుణానికి పాల్పడ్డాడు. ఓ వ్యక్తి అప్పు తీర్చలేదని చెప్పి.. ఆయన కుమార్తెను కిడ్నాప్ చేశాడు వడ్డీ వ్యాపారి. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో వెలుగు చూసింది.చీమకుర్తి మండలం మువ్వావారిపాలేనికి చెందిన శ్రీనివాసరావు గతంలో బేల్దారి పనులకు తిరుపతి వలస వెళ్లిన సమయంలో.. అక్కడ ఆర్. ఈశ్వర్ రెడ్డి వద్ద రూ.5 లక్షలు అప్పుతీసుకున్నాడు. దీంతో ఆ బాకీ చెల్లించకపోవడంతో శుక్రవారం చీమకుర్తి వచ్చిన ఈశ్వర్ రెడ్డి నేరుగా శ్రీనివాసరెడ్డి కుమార్తె చదువుకునే పాఠశాల వద్దకు వెళ్లాడు. అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై బయటకు వస్తున్న ఆ బాలికకు.. మీ నాన్న ఇంటికి తీసుకురమన్నాడంటూ మాయమాటలు చెప్పి బైక్పై ఈశ్వర్ రెడ్డి ఎక్కించుకున్నాడు. స్వీట్లు కొనిస్తానని చెప్పి దారి మళ్లించి ఒంగోలు తీసుకెళ్లాడు.అక్కడి నుంచి శ్రీనివాసరావుకు ఫోన్ చేసి మీ కుమార్తెను తీసుకెళుతున్నా.. నాకు ఇవ్వాల్సిన నగదు ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరింపులకు పాల్పడ్డాడు ఈశ్వర్ రెడ్డి. దీంతో అప్రమత్తమైన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్కూల్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను కిడ్నాప్ చేసింది తిరుపతికి చెందిన ఆర్ ఈశ్వర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.