పాల బిల్లుల కోసం రోడ్డు ఎక్కిన ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల కన్నెర్ర

పాల బిల్లుల కోసం హైవే దిగ్బంధం.విజయ డెయిరీ పాల బిల్లులు చెల్లించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గురువారం పాడి రైతులు హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. పాడి ఆవులు, గేదెలకు పశుగ్రాసం కొనలేక అప్పుల పాలవుతున్నామన్నారు. కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి రైతులను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను విరమింపజేశారు. కార్యక్రమంలో రైతులు విజేందర్‌రెడ్డి, రంగయ్య, యాకుబా, శేఖర్‌, దేవేందర్‌, నిరంజన్‌, ప్రసాద్‌రెడ్డి, సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.