ఉన్నమాట అంటే ఉలుకిపాటు ఎందుకు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నార‌ని.. హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది అబద్దమా?
కేంద్రం నుండి ఉపాధి హామీ, హెల్త్ మిషన్ వంటి పథకాల కింద వచ్చిన రూ. 2100 కోట్ల నిధులను గ్రామాలకు ఇవ్వకుండా దారి మళ్ళించింది అబద్దమా? 15 ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా ఆపింది అబద్దమా? మాజీ సర్పంచ్‌లు పెండింగ్ బిల్లుల కోసం ఛలో సచివాలయం పిలుపు నిస్తే వారిని పోలీస్ స్టేష‌న్‌ల‌లో నిర్బంధించింది అబద్దమా? గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అటకెక్కడం మేం చెప్పిన అబద్దమా? గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో డెంగీ, మలేరియా వంటి సీజనల్ రోగాలు ప్రబలడం అబద్ధమా? రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికుల జీతాలు చెల్లించకపోవడం అబద్ధమా? 8 నెలలుగా జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలకు గౌరవ వేతనం ఇవ్వకపోవడం అబద్ధమా? బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలకు నెలనెల రూ. 275 కోట్లు, సంవత్సరానికి రూ. 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది నిజం కాదా? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని హ‌రీశ్‌రావు సూటిగా ప్ర‌శ్నించారు.ఈ ప్రభుత్వం వాస్తవాలను aఅంగీకరించకుండా, సమస్యలు పరిష్కరించకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం సరికాదు. ఈ ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నది పచ్చి నిజం. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.