తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కండి

యువ ఇంజనీర్లకు మంత్రి హరీష్‌ రావు సూచన
హైదరాబాద్‌,మే23( జ‌నం సాక్షి): యువ ఇంజనీర్లకు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చిందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ఇతర శాఖల్లో ఎన్నో అవకాశాలు ఉన్నా ఇరిగేషన్‌ డిపార్టుమెంటును ఎంచుకున్నందుకు వారిని మంత్రి అభినందించారు. ఏఈఈలుగా ఎంపికైన యువ ఇంజనీర్లు కష్టపడి పని చేయాలని కోరారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌ లోని  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఇరిగేషన్‌ శాఖలో కొత్తగా ఎంపికైన ఎలక్ట్రికల్‌ , సివిల్‌ ఏఈఈలకు నియామక పత్రాలను మంత్రి అందజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో మొత్తం 686 మంది కొత్త ఇంజనీర్ల నియామకం జరిగిందని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో ఇది నాలుగో బ్యాచ్‌ అన్నారు. తెలంగాణలో ఉన్న 80 పంపింగ్‌ స్టేషన్స్‌ లో ఎలక్టిక్రల్‌ ఇంజనీర్లకు పోస్టింగ్స్‌ ఇచ్చామని తెలిపారు. ఈసారి ఎంపికైన బ్యాచ్‌ లో యువతులు ఎక్కువగా ఉన్నారని, వారంతా గ్రావిూణ ప్రాంతాల్లో పని చేస్తామని చెప్పడం అభినందనీయం అన్నారు. నాకేమిచ్చారని కాకుండా భూమికి తాను ఏమి ఇచ్చాను అని ఆలోచించుకొని ముందుకు సాగాలని మంత్రి హరీశ్‌ రావు సూచించారు. కోటి ఎకరాల మాగాణి లక్ష్యం సాధించే విధంగా యువ ఇంజనీర్లు కృషి చేయాలని కోరారు. సమన్వయం, సహకారం, ఓపికతో ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో పనిచేయాల్సి ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు సేవ చేసే అవకాశం విూకు వచ్చిందని, వారి దీవెనలు విూకు దొరకడం అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విూడియా అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ, ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.