ఆదిత్యునిపై నల్లటి బొట్టు!

న్యూఢిల్లీ, జూన్‌ 6 : ఆదిత్యునిపై నల్లటి బొట్టు! ఇదొక అద్భుత దృశ్యం. సూర్యుడు, శుక్రుడు, భూమి సమాన దూరంలో ఒక సరళరేఖలో వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుత దృశ్యం సాక్షాత్కరిస్తుందని పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. కనులారా చూసిన వారి జన్మధన్యం. ఎందుకంటే ఇలాంటి అరుదైన శుక్రయానం వీక్షించాలంటే మరో 105 ఏళ్లు ఆగాల్సిందే.  శుక్రయానాన్ని ప్రజలు వీక్షించారు. సూర్యుడిపై శుక్రుడు ప్రయాణం చేస్తున్న దృశ్యాలు అందర్నీ అలరించాయి.  ఈ అద్భుతాన్ని వీక్షించేందుకుగాను ఆనేక ప్రాంతాల్లో ప్రత్యేక టెలిస్కోప్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అద్భుత దృశ్యాన్ని బుధవారంనాడు ఉదయం 5గంటల నుంచి ఉదయం 10గంటల వరకు వీక్షించారు. విజయవాడలో కృష్ణాబ్యారేజీ వద్ద ప్రజలు ఈ దృశ్యాన్ని తిలకించేందుకు బారులుదీరారు. అలాగే వరంగల్‌లోని ప్లానిటోరియం అకాడమిక్‌ సైన్సు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కడపలోనూ ఈ దృశ్యం ప్రజలను అలరించింది.