జన్‌లోక్‌పాల్‌ కోసం.. జనంసాక్షిగా

మరణించేవరకు పోరాడుతా
నిర్వదిక దీక్ష ప్రారంభించిన హజారే
న్యూఢిల్లీ, జూలై 29 (జనంసాక్షి):
ప్రజా సంక్షేమమే పరమావధిగా కృషిచేస్తూ.. సామాజిక కార్యకర్తగా ఉన్న అన్నా హజారే ఆదివారం ఉదయం నిరాహారదీక్ష ప్రారంభించారు. జనలోక్‌పాల్‌ బిల్లు, మంత్రులపై విచారణ జరపాలి.. ఈ విషయమై గత కొంత కాలంగా అన్నా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈ అంశాలతో కూడిన డిమాండ్లను పరిష్కరించాలని కేంద్రానికి ఇచ్చిన నాలుగు రోజుల గడువు పూర్తవ్వడంతో ఆదివారంనాడు అన్నా హజారే నిరాహారదీక్ష చేపట్టారు. మీడియాతో మాట్లాడుతూ తనకు వయస్సు సహకరిం చకపోయినా తానేమి వెనుకంజ వేయబోనని ప్రజలకు మేలు చేకూర్చేంత వరకు విశ్రమించబోనన్నారు. ప్రజా సంక్షేమానికి దోహదపడే అంశమైన జనలోక్‌పాల్‌ కోసం మరణించేంతవరకు పోరాడుతానని ఉద్వేగంగా అన్నారు. తమ దీక్షలకు మద్దతు తెలిపే వారి సంఖ్య స్వల్పంగా ఉందనడం సరైంది కాదన్నారు. ప్రజావాణిని చూస్తే తనకే ఎంతో ఆనందం వేస్తోందన్నారు. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌, బీజెపిలకు ప్రత్యా మ్నాయం అవసరమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశయం తనకు లేదని స్పష్టం చేశారు..